గుడికి వెళ్లి మరో వివాదంలో చిక్కుకున్న ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి రాజకీయ దుమారంలో చిక్కుకున్నారు. గతంలో సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఆలయ సందర్శనలో జరిగిన సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ ఒక ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అర్చకులు ఆయనకు తిలకం దిద్ది ఆశీర్వాదం ఇచ్చారు. అయితే, ఆలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన ఆ బొట్టును తుడిచివేశారని ఆరోపణలు రావడంతో హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
'సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వంటిది' అని గతంలో వ్యాఖ్యానించిన నేత, ఇప్పుడు ఓట్ల కోసం ఆలయాలకు వెళ్లడం రాజకీయ కపటత్వమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ఉదయనిధి హిందూ భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని బీజేపీ, ఇతర కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. డీఎంకే నేతలు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారని, భక్తి లేకపోయినా నటన చేస్తున్నారని దుయ్యబడుతున్నాయి.
తమిళనాడులో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఈ అంశం విపక్షాలకు ఒక బలమైన ఆయుధంగా మారింది. సనాతన ధర్మంపై గత వ్యాఖ్యలు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చకు దారితీయగా, తాజా 'బొట్టు' వివాదం ఆ సెగను మరింత పెంచేలా కనిపిస్తోంది.