ఆదాయానికి మించిన ఆస్తులు... దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఆమె నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు బయటపడటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శాంతిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఏప్రిల్ 21 వరకు రిమాండ్ విధించారు. దాంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

మంగళవారం ఉదయం తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీ+2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

కాళింగిరి శాంతి గతంలోనూ పలు వివాదాలతో వార్తల్లో నిలిచారు. అక్రమాల ఆరోపణల కారణంగా గత ఏడాది జులై నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆమె సస్పెన్షన్‌లో ఉన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరుతో ముడిపడి పలు ఆరోపణలు రాగా, వాటిని ఆమెతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఖండించడం తెలిసిందే.

Kalingiri Shanti
Endowments Department
ACB Raids
Disproportionate Assets
Andhra Pradesh
Corruption Case
Vijay Sai Reddy
Tadepalli
Undavalli

More Telugu News