Khawaja Asif: భారత్ దాడి చేస్తే ఊరుకోం.. కోల్‌కతాపై విరుచుకుపడతామన్న పాక్ మంత్రి

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతూ, ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలతో సతమతమవుతున్న పాకిస్థాన్, మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కింది. భవిష్యత్తులో భారత్ తమపై ఎలాంటి సైనిక చర్యకు పాల్పడినా, ఈసారి కోల్‌కతా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

"ఈసారి కూడా మమ్మల్ని బాధ్యులను చేసి, భారత్ ఏదైనా సైనిక చర్యకు దిగితే, మా తదుపరి లక్ష్యం కోల్‌కతానే అవుతుంది" అని ఆసిఫ్ స్పష్టం చేశారు. అంతేగాక‌ భారత్ ఒక 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తమ వద్ద నివేదికలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. "భారత్ తమ సొంత ప్రజలతో గానీ, లేదా పాకిస్థానీలతో గానీ ఒక నకిలీ దాడి చేయించి, కొన్ని మృతదేహాలను ఎక్కడో పడేసి, వారు ఉగ్రవాదులని, ఈ దాడికి పాల్పడ్డారని ప్రచారం చేసే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు. అయితే, తన ఆరోపణలకు మద్దతుగా ఖవాజా ఆసిఫ్ ఎలాంటి ఆధారాలూ చూపించలేకపోయారు. భారత్ నుంచి ఎలాంటి దాడి జరిగినా తమ స్పందన వేగంగా, పక్కా ప్రణాళికతో, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఆయన గురువారం కూడా వ్యాఖ్యానించారు.

ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన మునుపటి హెచ్చరికలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు. పొరుగు దేశం ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, మునుపెన్నడూ లేనివిధంగా నిర్ణయాత్మకమైన జవాబు ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ గతంలో పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
Khawaja Asif
Pakistan
India
Kolkata
Defense Minister
False flag operation
Military action
Rajanth Singh
Terrorist attack

More Telugu News