Artemis II: చంద్రుడికి చేరువగా ఆర్టెమిస్-2.. భూమి అద్భుత చిత్రాలు పంపిన వ్యోమగాములు

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్ర విజయవంతంగా సాగుతోంది. సుమారు 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడి వైపు వెళుతున్న వ్యోమగాములు, అంతరిక్షం నుంచి మన భూమికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను పంపించారు. ఓరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి కమాండర్ రీడ్ వైస్‌మన్ ఈ ఫొటోలను తీశారు.

నాసా విడుదల చేసిన చిత్రాలలో ఓరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి వంపు తిరిగిన భూమి అంచు స్పష్టంగా కనిపించింది. మరో చిత్రంలో తెల్లటి మేఘాలతో కప్పబడిన సముద్రాలు, ఆకుపచ్చని అరోరాతో మెరుస్తున్న పూర్తి భూగోళం అద్భుతంగా దర్శనమిచ్చింది. భూమిపై రాత్రి, పగలును వేరుచేసే 'టెర్మినేటర్' లైన్‌ను కూడా ఒక ఫొటోలో బంధించారు. "ఈ భూమ్మీద మేల్కొని ఉన్నా, నిద్రిస్తున్నా మనమందరం కలిసి ఈ గ్రహంపైనే ఉన్నాం" అని నాసా ఒక ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.

శుక్రవారం నాటికి వ్యోమగాములు భూమి నుంచి 1,80,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. చంద్రుడి సమీప కక్ష్యకు చేరేందుకు మరో 2,40,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. సోమవారం నాటికి వీరు తమ గమ్యస్థానానికి చేరుకుంటారని అంచనా. ఈ యాత్రలో ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నారు. వీరు చంద్రుడిపై దిగకుండా, దాని చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి భూమికి రానున్నారు.

1972లో అపోలో-17 తర్వాత చంద్రుడి వద్దకు మనుషులను తీసుకెళుతున్న తొలి యాత్ర ఇదే కావడం విశేషం. మిషన్ సజావుగా సాగుతోందని నాసా ఎక్స్‌ప్లొరేషన్ సిస్టమ్స్ లీడర్ లకీషా హాకిన్స్ తెలిపారు.
Artemis II
NASA
Moon mission
Orion capsule
Space exploration
Reid Wiseman
Lakisha Hawkins
Earth images
Lunar orbit

More Telugu News