Mahesh Kumar Goud: బీఆర్ఎస్ క్లోజ్... ఆ పార్టీ రోడ్డున పడింది: పీసీసీ మహేశ్ గౌడ్
తెలంగాణలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని, బీజేపీకి ఇక్కడ స్థానం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కాంగ్రెస్నే నమ్ముతున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని మహేశ్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత సొంతంగా వేరు కుంపటి పెట్టుకోవడంతో బీఆర్ఎస్ పరిస్థితి రోడ్డున పడిందని చెప్పారు. పార్టీలో కేటీఆర్, హరీశ్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని, దీనివల్ల అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలకు దూరమై కేవలం తన ఫామ్హౌస్కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే ఆ పార్టీని ప్రజలు దూరం పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. "ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. రాష్ట్రంలో మాకు 100 సీట్లు రావడం ఖాయం" అని ఆయన జోస్యం చెప్పారు.