Chandrababu Naidu: అమరావతికి 200 ఏళ్లు పడుతుంది: చంద్రబాబుపై రాచమల్లు విమర్శలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవతల రాజధాని నిర్మిస్తామంటూ 2014లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు కేవలం భూ దోపిడీకే పరిమితమైందని ఆయన ఆరోపించారు. బంగారు పండించే 50 వేల ఎకరాల భూములను రైతుల నుంచి దుర్మార్గంగా లాక్కున్నారని మండిపడ్డారు.
రెండు లక్షల కోట్ల వ్యయంతో లక్ష ఎకరాల్లో నిర్మాణం చేపడతామన్న బాబు, గత ఏడేళ్లలో కేవలం 80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. ఇదే వేగంతో వెళితే రాజధాని పూర్తి కావడానికి 200 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పి, ఇప్పటికే వేల కోట్లు అప్పులు చేశారని, చదరపు అడుగుకు రూ. 4 వేలు ఖర్చయ్యే చోట రూ. 14 వేలు చూపిస్తూ నిధులు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం కేవలం బేతాళ కథల వంటిదని, చంద్రబాబు హయాంలో ఇది ఎప్పటికీ పూర్తి కాదని రాచమల్లు స్పష్టం చేశారు.