Donald Trump: ఇరాన్‌లో ఎత్తైన బ్రిడ్జిని కూల్చేసిన అమెరికా... ఇది ఆరంభమేనన్న ట్రంప్

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమయ్యాయి. "ఇరాన్‌ను రాతియుగానికి పంపుతాం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటలకే ఇరాన్‌లోని కీలక నిర్మాణంపై భీకర దాడి జరిగింది. టెహ్రాన్ సమీపంలోని కరాజ్ నగరంలో, ప‌శ్చిమాసియాలోనే అత్యంత ఎత్తైన వంతెనను ఈ దాడుల్లో పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.

నిర్మాణంలో ఉన్న ఈ వంతెన, పూర్తయితే రాజధాని టెహ్రాన్‌ను పశ్చిమ నగరమైన కరాజ్‌తో అనుసంధానిస్తుంది. 136 మీటర్ల ఎత్తుతో దీన్ని మధ్యప్రాచ్య 'ఇంజినీరింగ్ అద్భుతం'గా అభివర్ణిస్తున్నారు. దాడి జరిగిన ప్రదేశం నుంచి దట్టమైన పొగలు వెలువడుతూ, వంతెన కూలిపోతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. "కొన్ని నిమిషాల క్రితం అమెరికా-జయనిస్ట్ శత్రువులు కరాజ్‌లోని బీ1 వంతెనను లక్ష్యంగా చేసుకున్నారు" అని ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రకటించింది. తొలి దాడిలో ఇద్దరు పౌరులు గాయపడగా, సహాయక చర్యల కోసం సిబ్బంది అక్కడికి చేరుకున్న సమయంలో రెండో దాడి జరిగిందని తెలిపింది.

ఈ దాడికి సంబంధించిన విజువల్స్‌ను ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు. "ఇరాన్‌లో అతిపెద్ద వంతెన కూలిపోయింది. దాన్ని మళ్లీ ఉపయోగించలేరు. మరిన్ని దాడులు జ‌ర‌గ‌బోతున్నాయి!" అని ఆయన పేర్కొన్నారు. "ఇంకా సమయం మించిపోకముందే ఇరాన్ ఒక ఒప్పందానికి రావాలి" అని కూడా హెచ్చరించారు.

అంతకుముందు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో తాము విజయం సాధించామని ప్రకటించారు. అమెరికా సైనిక చర్యలతో టెహ్రాన్ సైనిక శక్తిని నాశనం చేశామని, త్వరలోనే 'పని పూర్తి చేస్తామని' తెలిపారు. కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని చెప్పారు. రాబోయే 2-3 వారాల పాటు ఇరాన్‌పై 'అత్యంత కఠినంగా' దాడులు చేస్తామని, ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను మరోసారి లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. "మా శత్రువులు ఓడిపోతున్నారు. గత ఐదేళ్లుగా నా అధ్యక్షతన అమెరికా గెలుస్తూనే ఉంది. ఇప్పుడు మునుపెన్నడూ లేనంత పెద్ద విజయాన్ని సాధిస్తోంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Donald Trump
Iran
Karaj bridge
US Israel attacks
Iran bridge attack
Middle East engineering
Iran nuclear deal
Tehran
US military action
Iran war

More Telugu News