Sachin Tendulkar: 15 ఏళ్లయినా ఆ రాత్రిని మర్చిపోలేం.. 2011 ప్రపంచకప్ ఫైనల్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన 2011 ప్రపంచకప్ విజయాన్ని సాధించి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నాడు. ఆ ఫైనల్ మ్యాచ్‌లోని ఉత్కంఠను, విజయం తర్వాత కలిగిన ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.

"మొదటి బంతి ఎప్పుడూ గుండె వేగాన్ని పెంచుతుంది. కానీ ఆ రాత్రి, ఆ వేగం అస్సలు తగ్గలేదు. 15 ఏళ్ల తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు మాతోనే ఉన్నాయి. భారత్ కోసం ప్రపంచకప్ గెలవాలనే ఒకే ఒక్క కలతో మేమంతా పెరిగాం. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ, అభిమానులందరికీ ధన్యవాదాలు" అంటూ సచిన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌ను సొంత గడ్డపై గెలవడం సచిన్‌కు మరపురాని అనుభూతిని మిగిల్చింది.

2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక, మహేల జయవర్ధనే అద్భుతమైన సెంచరీతో (103 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ స్కోరు సాధించింది.

275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గౌతమ్ గంభీర్, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, 97 పరుగులతో విజయానికి బలమైన పునాది వేశాడు.

అనంతరం కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రీజులో నిలబడి మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. యువరాజ్ సింగ్‌తో (21 నాటౌట్) కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ధోనీ, కేవలం 79 బంతుల్లో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరిలో సిక్సర్ బాది భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 1983 తర్వాత భారత్ రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడి, దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయింది.
Sachin Tendulkar
2011 World Cup
India vs Sri Lanka
MS Dhoni
Gautam Gambhir
Yuvraj Singh
Cricket World Cup Final
Wankhede Stadium
Indian Cricket
Mahela Jayawardene

More Telugu News