Kinjarapu Atchannaidu: మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశారని తెలిపారు.

అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ యుద్ధ ప్రభావం, అధిక పెట్టుబడి ఖర్చుల కారణంగా మార్కెట్‌లో ధరల పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి అంగీకరించారు. అయితే, ఇదే అదనుగా కొన్ని రాజకీయ పార్టీలు ధరలు పూర్తిగా పడిపోయాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దని రైతులకు సూచించారు.

గతంలో ధాన్యం, మిర్చి, మామిడి, పొగాకు వంటి పంటల విషయంలో మార్కెట్ ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వమే నేరుగా జోక్యం చేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకుందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మొక్కజొన్న రైతుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. రైతుల పెట్టుబడి ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ధరలను పెంచాలని కంపెనీలు, వ్యాపారులను కోరారు.

రైతులకు అవసరమైన విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం వంటి అంశాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం, కొనుగోలుదారులు, రైతులు సమన్వయంతో పనిచేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Kinjarapu Atchannaidu
Andhra Pradesh agriculture
AP agriculture minister
Maize farmers
Corn farmers
MSP for maize
Chandrababu Naidu
Markfed
Gulf war impact
Crop prices

More Telugu News