Anil Ambani: అనిల్ అంబానీ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... తాజాగా కేసు నమోదు చేసిన సీబీఐ

Anil Ambani Faces New CBI Case Over Alleged LIC Fraud
షార్ట్స్‌లో చూడండి
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ఆయన సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కి రూ.3,750 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం కేసు నమోదు చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ, ఆర్‌కామ్‌తో పాటు కొందరు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులను నిందితులుగా చేర్చారు.

ఎల్ఐసీ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్‌కామ్ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు సమాచారం ఇచ్చి, ఆస్తులకు మించిన భద్రత ఉందని నమ్మించి, రూ.4,500 కోట్ల విలువైన నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లను (ఎన్‌సీడీ) ఎల్ఐసీకి మోసపూరితంగా అంటగట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీడీవో ఇండియా ఎల్ఎల్‌పీ అనే సంస్థ 2020 అక్టోబర్ 15న ఇచ్చిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ఎల్ఐసీ తన ఫిర్యాదుకు ఆధారంగా చూపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన నిధులను దుర్వినియోగం చేయడం, అనుబంధ సంస్థల ద్వారా నిధులను దారి మళ్లించడం, నకిలీ బిల్లులతో నిధులు పొందడం వంటి అనేక అక్రమాలకు ఆర్‌కామ్ పాల్పడినట్లు ఆడిట్‌లో తేలింది.

ఆర్‌కామ్‌, అనిల్ అంబానీపై సీబీఐ కేసులు నమోదు చేయడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని పలు బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలపై మూడు కేసులు నమోదయ్యాయి. ఎస్‌బీఐకి రూ.2,929.05 కోట్లు నష్టం కలిగించారన్న కేసులో సీబీఐ అధికారులు అనిల్ అంబానీని ఢిల్లీలో రెండు రోజుల పాటు విచారించారు కూడా. ఎస్‌బీఐతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పలు బ్యాంకులు కూడా ఆర్‌కామ్‌పై ఫిర్యాదులు చేశాయి. ప్రస్తుతం ఈ కేసులన్నింటిపైనా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించింది.
Go Back to Shorts
Anil Ambani
Reliance Communications
RCom
CBI Investigation
LIC
Financial Fraud
Loan Default
Indian Banks
SBI
Non Convertible Debentures

More Telugu News