Stock Markets: రెండ్రోజుల తర్వాత మళ్లీ కళకళలాడిన భారత స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు బ్రేక్ పడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు లాభపడి 73,134.34 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 348 పాయింట్లు పెరిగి 22,679.40 వద్ద క్లోజ్ అయింది.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న ఆశలతో మార్కెట్లు ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే, సెషన్ చివరి గంటల్లో ఆ ఉత్సాహం కొంత తగ్గడంతో సూచీలు ఆరంభ లాభాల్లో కొంత భాగాన్ని కోల్పోయాయి. అయినప్పటికీ, చివరికి ప్లస్‌లోనే ముగియగలిగాయి.
బెంచ్‌మార్క్ సూచీలతో పోలిస్తే బ్రాడర్ మార్కెట్లు మరింత మెరుగ్గా రాణించాయి. 

నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 2.24 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 3.24 శాతం చొప్పున పెరిగాయి. రంగాలవారీగా చూస్తే, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా లాభపడింది. కెమికల్, మీడియా రంగాల్లోనూ కొనుగోళ్ల మద్దతు కనిపించింది. అయితే, మార్కెట్ ట్రెండ్‌కు విరుద్ధంగా నిఫ్టీ హెల్త్‌కేర్, ఫార్మా రంగాలు నష్టాలతో ముగియడం గమనార్హం.

టెక్నికల్ అంశాలపై విశ్లేషకులు స్పందిస్తూ, నిఫ్టీ 22,500 స్థాయిని నిలబెట్టుకోకపోతే అమ్మకాల ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎగువన 23,000 స్థాయి కీలక నిరోధకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మార్కెట్ల తదుపరి కదలికలు అమెరికా నుంచి వెలువడనున్న నాన్-ఫార్మ్ పేరోల్స్, నిరుద్యోగిత రేటు వంటి కీలక గణాంకాలపై ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Stock Markets
Sensex
Nifty
Indian Stock Market
Share Market
Market Analysis
Market Trends
Financial News
Nifty Midcap
Nifty Smallcap

More Telugu News