Koushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 4న హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
కేసు వివరాల్లోకి వెళితే... జనవరి 29న హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలో జరిగిన 'మినీ మేడారం' (సమ్మక్క-సారలమ్మ) జాతర సందర్భంగా గొడవ చోటుచేసుకుంది. జాతరకు వెళుతున్న కౌశిక్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులతో ఆయన తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకున్న పోలీసులు, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీపీ మతాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణలు డిమాండ్ చేసింది.
పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఉన్నతాధికారులపై వ్యక్తిగత, మతపరమైన దూషణలకు దిగడం వంటి అంశాలపై అప్పట్లో నమోదైన కేసును ఇప్పుడు సీఐడీ విచారిస్తోంది. దీనికి సంబంధించి ఆయన వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.