Australian Fuel Crisis: ఇంధన సంక్షోభం... ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాలు

ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విక్టోరియా, టాస్మానియా రాష్ట్రాలు తమ ప్రజలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నిర్ణయంతో లక్షలాది మందికి ఊరట కలగనుంది.

విక్టోరియా రాష్ట్రంలో మార్చి 31 నుంచి నెల రోజుల పాటు మెట్రోపాలిటన్, వి/లైన్ సర్వీసుల పరిధిలోని రైళ్లు, ట్రామ్‌లు, బస్సుల్లో ప్రయాణం పూర్తిగా ఉచితం. ఇంధన ఖర్చుల ఒత్తిడిని తగ్గించేందుకు ఈ తాత్కాలిక చర్య తీసుకున్నామని విక్టోరియా ముఖ్యమంత్రి జసింతా అల్లన్ తెలిపారు. "ఇది అన్ని సమస్యలను పరిష్కరించకపోయినా, ప్రజలకు తక్షణ సహాయం అందిస్తుంది" అని ఆమె వివరించారు. ఈ నిర్ణయంతో ప్రజలు నెలకు సుమారు 220 డాలర్ల వరకు ఆదా చేసుకుంటారని అంచనా.

అదేవిధంగా, టాస్మానియా రాష్ట్రంలో మార్చి 30 నుంచి జూలై 1 వరకు మూడు నెలల పాటు బస్సులు, ఫెర్రీ సేవలను ఉచితంగా అందిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జెరెమీ రాక్‌లిఫ్ ప్రకటించారు. ఈ కాలంలో తమ రాష్ట్ర ప్రజలు ప్రజా రవాణాకు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధ పరిణామాలతో ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడి ఆస్ట్రేలియాలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. అనేక ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడి వ్యవసాయం, మైనింగ్ రంగాలపై ప్రభావం పడింది. ఇది దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి కూడా కారణమవుతోంది.

ప్రస్తుత పరిస్థితులపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పందిస్తూ, సమీప భవిష్యత్తులో ఇంధన సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. అయితే, న్యూ సౌత్ వేల్స్ వంటి ఇతర రాష్ట్రాలు మాత్రం ఇలాంటి ఉచిత పథకాలను ప్రకటించేది లేదని స్పష్టం చేశాయి.


Australian Fuel Crisis
Victoria
Tasmania
Free Public Transport
Jacinta Allan
Jeremy Rockliff
Fuel Prices Australia
Iran War Impact
Cost of Living Crisis
Anthony Albanese

More Telugu News