రఘురామపై దాడిని ఖండించిన పవన్.. కుట్ర కోణం ఉందంటూ అనుమానం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. పండుగ రోజున, ఆలయం వద్ద జరిగిన ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు.

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని రామాలయంలో పూజలకు వెళుతున్న సమయంలో రఘురామకృష్ణరాజు, ఆయన అనుచరులు, జనసేన నాయకులపై కొందరు వ్యక్తులు ఆయుధాలతో దాడికి పాల్పడ్డారని పవన్ వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. "హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే శ్రీరామ నవమి రోజున ఈ దాడి జరగడం దారుణం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనను అత్యంత తీవ్రమైనదిగా పరిగణించాలని, దాడి వెనుక ఉన్న సూత్రధారులను విచారణ ద్వారా గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.


More Telugu News