భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యులకు చేదు అనుభవం... స్టేడియంలోకి అనుమతి నిరాకరణ

హాంకాంగ్‌తో జరగనున్న ఏఎఫ్‌సీ ఆసియా కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందు, కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలోకి ప్రాక్టీస్ మ్యాచ్ కోసం వెళ్లిన ప్రధాన కోచ్, ముగ్గురు ఆటగాళ్లను అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. ఫలితంగా మ్యాచ్‌కు ముందు జరగాల్సిన మీడియా సమావేశం జరగలేదు. ఫుట్‌బాల్ జట్టు సభ్యులను స్టేడియంలోకి అనుమతించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టు పేలవమైన ఆటతో నిరాశపరుస్తోంది. ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్‌‌తో మ్యాచ్‌కు సిద్ధమవ్వాలనుకున్న జట్టుకు ఈ స్టేడియం లోపలికి అనుమతి లభించలేదు. అయితే ఆలిండియా ఫుట్‌బాల్ సంఘం బాకీ డబ్బులు చెల్లించని కారణంగా సిబ్బంది వారిని లోపలకి అనుమతించలేదని తెలుస్తోంది.

ఈ అంశంపై కొచ్చి ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ, చిన్న సాంకేతిక సమస్య ఏర్పడిందని, అందుకే కోచ్, ముగ్గురు ఆటగాళ్ళను అనుమతించలేదని చెప్పాడు. షెడ్యూల్ ప్రకారం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని చెప్పాడు. ఆసియా కప్ క్వాలిఫయర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని అన్నారు.


More Telugu News