రేపటి నుంచే ఐపీఎల్-2026... కొత్త ఫీచర్లతో లైవ్ స్ట్రీమింగ్... ఎక్కడ, ఎలా చూడాలంటే?

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. భారత్‌లో ఈ టోర్నమెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియోహాట్‌స్టార్ తమ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. 

ఈసారి జియోహాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ కామెంట్రీ అందుబాటులో ఉంటుంది. అదనంగా బెంగాలీ, భోజ్‌పురి, హర్యానీ భాషల్లోనూ ఫీడ్స్ ఉంటాయి. మొబైల్ యూజర్ల కోసం ప్రత్యేకంగా వర్టికల్ లైవ్ ఫీడ్, 360-డిగ్రీ వ్యూ, మల్టీ-క్యామ్ ఫీచర్లను కూడా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2016 విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు తలపడనున్నాయి. రెండు నెలలకు పైగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనున్న ఈ టోర్నీ మే 31న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.

ఈ సీజన్‌లో మొత్తం 12 డబుల్ హెడర్ రోజులు ఉన్నాయి. డబుల్ హెడర్ ఉన్న రోజుల్లో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు, రెండో మ్యాచ్ యథావిధిగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం జరిగే మ్యాచ్‌లకు 7:00 గంటలకు టాస్ వేస్తారు. టోర్నమెంట్‌లో పాల్గొంటున్న పది జట్లు గ్రూప్ స్టేజ్‌లో ఒక్కోటి 14 మ్యాచ్‌లు ఆడతాయి. గ్రూప్ స్టేజ్ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2, ఫైనల్ ఫార్మాట్‌లో ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు బరిలోకి దిగుతున్నాయి.

ఈ మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్ నగరాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.



More Telugu News