April 1 Changes: ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు... మీ జేబుపై ప్రభావం చూపే అంశాలివే!

Key financial regulatory changes to take effect from April 1
షార్ట్స్‌లో చూడండి
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో... దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక, నియంత్రణపరమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆదాయపు పన్ను, ఇంధన ధరలు, బ్యాంకింగ్, రైల్వే ప్రయాణాలకు సంబంధించి రాబోతున్న ఈ మార్పులు సామాన్యుడి దైనందిన జీవితంపై, జేబుపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.

ఆదాయపు పన్ను విధానంలో భారీ సంస్కరణలు
అతిపెద్ద మార్పు ఆదాయపు పన్ను విధానంలో జరగనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో సరళీకరించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులకు గందరగోళంగా ఉన్న ‘అసెస్మెంట్ ఇయర్ (AY)’, ‘ప్రీవియస్ ఇయర్ (PY)’ వంటి పదాల స్థానంలో సులభంగా అర్థమయ్యేలా ‘పన్ను సంవత్సరం (Tax Year)’ అనే పదాన్ని ఉపయోగించనున్నారు.

కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87ఏ కింద రిబేట్ పెంచడంతో వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరటనిచ్చే అంశం. అలాగే, ఫారం-16, ఫారం-16ఏ స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఫారం-130, ఫారం-131లను ప్రవేశపెట్టనున్నారు. పాన్ కార్డు దరఖాస్తులకు పుట్టిన తేదీ రుజువుగా ఇకపై ఆధార్ కార్డును అంగీకరించరు. దీనికి బదులుగా 10వ తరగతి సర్టిఫికెట్ లేదా పాస్‌పోర్ట్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

రైల్వే.. ఇంధన రంగాల్లో మార్పులు
భారతీయ రైల్వే కూడా ప్రయాణికులకు అనుకూలంగా నిబంధనలను సవరించింది. ఇప్పటివరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు వరకు టికెట్ రద్దు చేసుకుంటేనే రిఫండ్ లభించేది. ఏప్రిల్ 1 నుంచి ఈ గడువును 8 గంటలకు పెంచారు. ఒకవేళ 8 నుంచి 24 గంటల మధ్య టికెట్‌ను రద్దు చేసుకుంటే 50 శాతం రిఫండ్ లభిస్తుంది.

మరోవైపు ప‌శ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశంలో వంటగ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ ధరలను సవరించే అవకాశం ఉంది. దీంతో పాటు సీఎన్‌జీ, పీఎన్‌జీ, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కూడా పెరగొచ్చని అంచనా. ఇది రవాణా, విమాన ప్రయాణ చార్జీలపై ప్రభావం చూపవచ్చు.

బ్యాంకింగ్ నిబంధనల్లో సవరణలు
కొన్ని ప్రధాన బ్యాంకులు తమ ఏటీఎం, డెబిట్ కార్డు నిబంధనలను మార్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉచిత లావాదేవీల పరిమితిలోకి యూపీఐ ఏటీఎం విత్‌డ్రాయల్స్‌ను కూడా చేర్చింది. 5 ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి రూ.23 చార్జీ విధిస్తుంది. బంధన్ బ్యాంక్ మెట్రో నగరాల్లో 3, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను అనుమతిస్తుంది. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.23, ఖాతాలో డబ్బుల్లేక విఫలమైన లావాదేవీకి రూ.25 చొప్పున వసూలు చేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కొన్ని రకాల డెబిట్ కార్డులపై రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని రూ.50,000 నుంచి రూ.75,000కు తగ్గించింది. ఈ మార్పులన్నీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Go Back to Shorts
April 1 Changes
Income Tax
Tax Year
Railway
LPG Cylinder Price
Banking Regulations
HDFC Bank
Bandhan Bank
PNB
Financial Changes

More Telugu News