అది ఎప్పుడూ తెరిచే ఉందిగా.. అమెరికాపై పాక్ మంత్రి సెటైర్

హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించడమే తమ లక్ష్యమని అమెరికా చేసిన ప్రకటనపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యంగ్యంగా స్పందించారు. అసలు ఆ జలసంధి ఎప్పుడూ మూతపడలేదని, అది ఇప్పటికీ తెరిచే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధిలో రవాణా నిలిచిపోయిందని, దాన్ని పునరుద్ధరించడమే తమ సైనిక చర్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. దీనిపై స్పందించిన ఆసిఫ్.. ‘‘అసలు ఆ జలసంధి ఎప్పుడు మూతపడింది?’’ అని ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాల నౌకలను ఇరాన్ ఇప్పటికే అనుమతిస్తోందని ఆయన గుర్తుచేశారు.

అంతర్జాతీయ వాణిజ్యం పేరు చెప్పి, పశ్చిమాసియాలో ఆధిపత్యం చెలాయించేందుకే అమెరికా ప్రయత్నిస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. లేని సమస్యను సృష్టించి, యుద్ధానికి ఒక సాకుగా వాడుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలతో ఈ విషయంలో పాకిస్థాన్, ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఒకవేళ ఈ మార్గం పూర్తిగా మూతపడితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. అయితే, తమ మిత్ర దేశాల నౌకలను ఇరాన్ అనుమతిస్తున్నందున, అమెరికా చెబుతున్నట్లుగా రవాణా పూర్తిగా స్తంభించలేదని పాకిస్థాన్ వాదిస్తోంది.


More Telugu News