ఎన్నికల హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ను నిలదీస్తాం: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం నాడు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా, అసెంబ్లీకి వెళ్లేముందు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని, వాటికి చట్టబద్ధత కల్పించాలని, బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించడం తమ పార్టీకి సంప్రదాయమని కేటీఆర్ గుర్తుచేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రైతులను పట్టించుకోకుండా రాహుల్ గాంధీ కోసం రూ.1000 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. "రాహుల్ బంధు కాదు, రైతు బంధు ఇవ్వండి" అనే నినాదంతో తాము పోరాడతామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో పంట వేయకముందే రైతు బంధు నిధులు అందేవని, ఇప్పుడు పంట కోతలు పూర్తవుతున్నా ప్రభుత్వ సాయం అందడం లేదని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, తొలి కేబినెట్‌లోనే చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా గ్యారెంటీలకు చట్టపరమైన భద్రత కల్పించలేదని విమర్శించారు. గతంలో గవర్నర్ ప్రసంగంలోనూ ఈ హామీ ఇచ్చినా, ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. బలహీన వర్గాలకు ఐదేళ్లలో రూ.1 లక్ష కోట్లు కేటాయిస్తామన్న హామీపైనా స్పష్టత లేదని అన్నారు. ఈ అంశాలన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావించి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు.


More Telugu News