మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు... ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా ఆరుగురికి పాజిటివ్

మొయినాబాద్‌ లోని అజీజ్‌ నగర్ ఫామ్‌హౌస్‌ పై జరిగిన ‘ఈగల్’ బృందం దాడుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ ధృవీకరించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు.

శనివారం రాత్రి 11 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ ఒక మహిళ సహా మొత్తం 11 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌కు తొలుత నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చినప్పటికీ, తదుపరి రక్త పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని ఎస్పీ చెప్పారు. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ వినియోగించినట్లు శాస్త్రీయ ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు.


More Telugu News