ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ కుట్రలు చేస్తున్నారు: యామినీ శర్మ
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ చేస్తున్న విమర్శలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ అధినేత జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారని యామినీ శర్మ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు తమ సొంత స్టిక్కర్లు వేసుకుని క్రెడిట్ కొట్టేయాలని చూశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలుస్తోందని, ఇప్పటికైనా వైసీపీ నాయకులు సూపర్ సిక్స్ పథకాలపై, కూటమి పాలనపై అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. వైసీపీపై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని, అందుకే 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు.