లూజ్‌గా పెట్రోల్ అమ్మొద్దు.. బంకులకు కేంద్రం వార్నింగ్

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్‌ను సీసాలు, డబ్బాలు వంటి విడి పాత్రలలో నిల్వ చేసుకోవడంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అదే సమయంలో, దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇటీవల తమిళనాడులోని ఒక రిటైల్ అవుట్‌లెట్‌లో వినియోగదారుడికి లూజ్ కంటైనర్‌లో పెట్రోల్ పోసిన విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది భద్రతా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, అందుకే ఆ పెట్రోల్ బంక్‌ లైసెన్సును తక్షణమే సస్పెండ్ చేసి, సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పేర్కొంది.

ఈ నేపథ్యంలో, దేశంలోని అన్ని రిటైల్ అవుట్‌లెట్లు, డీలర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఇంధనాన్ని సరఫరా చేసేటప్పుడు భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పెట్రోల్ వంటి మండే స్వభావం ఉన్న ఇంధనాన్ని అసురక్షిత పద్ధతుల్లో నిల్వ చేయడం వల్ల తీవ్రమైన అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ప్రజలు ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది.


More Telugu News