ఓటీటీల ఫిర్యాదు.. టెలిగ్రామ్‌కు కేంద్రం షాక్!

  • పైరసీ కంటెంట్‌పై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
  • ఓటీటీల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సమాచార శాఖ
  • 3,142 పైరసీ ఛానెళ్లను గుర్తించిన అధికారులు
  • అశ్లీల కంటెంట్ కారణంగా ఇటీవల 5 ఓటీటీలపై నిషేధం
  • డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణ పెంచుతున్న ప్రభుత్వం
పైరసీ కంటెంట్‌ను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) తాజాగా నోటీసులు జారీ చేసింది. కాపీరైట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు తమ ప్లాట్‌ఫామ్‌పై విచ్చలవిడిగా షేర్ అవుతున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 కింద ఈ నోటీసులు ఇచ్చింది.

జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలు తమ కంటెంట్‌ను అనుమతి లేకుండా టెలిగ్రామ్‌లో విస్తృతంగా పంచుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన అధికారులు సుమారు 3,142 టెలిగ్రామ్ ఛానెళ్లలో పైరసీ కంటెంట్ పంపిణీ జరుగుతున్నట్లు గుర్తించారు. టెలిగ్రామ్‌లో పెద్ద సైజు ఫైల్స్ పంపే సౌలభ్యం, వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉండటం వంటి ఫీచర్లను కొందరు పైరసీ కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు తేలింది.

ఇదిలా ఉంటే... అభ్యంతరకర, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయన్న ఆరోపణలపై కేంద్రం ఇటీవల కఠినంగా వ్యవహరిస్తోంది. కొద్ది రోజుల క్రితమే మూడ్‌ఎక్స్‌వీఐపీ, కోయల్ ప్లేప్రో, డిజి మూవీప్లెక్స్ సహా ఐదు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. గతంలో 2025 జులైలో కూడా ఇదే తరహా చర్యలు తీసుకున్నారు. అప్పట్లో అల్ట్, ఉల్లు, బిగ్‌షాట్స్ యాప్, దేశీఫ్లిక్స్ వంటి 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వెబ్‌సైట్లు, యాప్‌లను బ్లాక్ చేయాలని ఆదేశించారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) రూల్స్-2021 ప్రకారం.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అశ్లీల, అసభ్యకరమైన, ఇతరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకూడదు. ఆన్‌లైన్ పైరసీని అరికట్టడంతో పాటు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై అభ్యంతరకర కంటెంట్‌ను నియంత్రించే విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వం ఈ తాజా చర్యలు తీసుకుంటోంది.


More Telugu News