మహేశ్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన దర్శకుడు హరీశ్‌ శంకర్.. కార‌ణ‌మిదే!

  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్‌లో ట్వీట్‌పై మొదలైన వివాదం
  • పూర్తిగా చదవకుండానే పొరపాటున స్పందించానని వివరణ
  • మహేశ్‌ బాబుపై తనకు ఎంతో గౌరవం ఉందని వెల్లడి
  • ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరిన దర్శకుడు
ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు అభిమానులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రచార కార్యక్రమాల సందర్భంగా సోషల్ మీడియాలో తాను చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించి వివరణ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే... పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మహేశ్‌ బాబు సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని ఆశిస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు హరీశ్‌ శంకర్ రిప్లై ఇవ్వడంతో మహేశ్ ఫ్యాన్స్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్‌ శంకర్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ వివాదంపై హరీశ్‌ శంకర్ వెంటనే స్పందించారు. సినిమా షూటింగ్, సెన్సార్ పనుల హడావుడిలో ఉండటం వల్ల ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవలేదని, కేవలం అభిమాని ఉత్సాహాన్ని చూసి పొరపాటున స్పందించానని తెలిపారు. తనకు మహేశ్‌ బాబు అంటే ఎంతో గౌరవమని, గతంలో ఆయన ‘పోకిరి’ సినిమాను ఎంతగానో ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు.

రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో రాబోయే సినిమా భారీ రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన రిప్లై వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో కావాలని వివాదాలు సృష్టించే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు.



More Telugu News