తెలుగు రాష్ట్రాలపై యుద్ధ ప్రభావం.. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం

Telangana Hotels Association Meeting on War Impact Gas Shortage
  • కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల నిలిపివేతపై హోటల్ యజమానుల ఆందోళన
  • ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం చూపించాలన్న తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
  • వాణిజ్య సిలిండర్ల కొరత ఉందన్న విశాఖ హోటల్ మర్చంట్ సంఘం
గ్యాస్ కొరత తెలుగు రాష్ట్రాలలోని హోటల్ పరిశ్రమపై కూడా పడింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీలలో పలు హోటళ్లు తాత్కాలికంగా మూతబడిన విషయం తెలిసిందే. వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొరత ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని హోటళ్లపై కూడా పడింది. హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లను పెట్రోలియం కంపెనీలు ఆదేశించాయి. దీనితో హోటల్, రెస్టారెంట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో తమ వ్యాపారానికి గండిపడిందని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్యాస్ కొరతతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని విశాఖ హోటల్ మర్చంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. సిలిండర్ల సరఫరా రేపటి నుంచి మరింత తగ్గవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఇప్పటి వరకు బ్లాక్ మార్కెట్ నడుస్తోందని, పరిస్థితి ఇలాగే ఉంటే నిర్వహణ కష్టంగా మారుతుందని అన్నారు. వాణిజ్య సిలిండర్ల కొరతపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. గ్యాస్ కొరత లేకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చూడాలని కోరారు.
Go Back to Shorts
Telangana Hotels Association
Telangana
Andhra Pradesh
Hotel Industry
Gas Shortage

More Telugu News