మార్చి 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

  • ఈ నెల 19న ఉగాది పర్వదినం
  • ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 17న ఆలయ శుద్ధి కార్యక్రమం
  • 17న బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలు రద్దు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో త్వరలో జరగబోయే 'ఉగాది ఆస్థానం' వేడుకలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 19న తెలుగు నూతన సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించే ఈ ప్రత్యేక పర్వదినం కోసం ఆలయాన్ని శుద్ధి చేసేందుకు మార్చి 17న (మంగళవారం) 'కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు వైకుంఠ ఏకాదశి వంటి ప్రధాన పండుగలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం టీటీడీలో అనాదిగా వస్తున్న ఆచారం.


ఈ నేపథ్యంలో మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది. దీని కారణంగా మార్చి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఉగాది పర్వదినం సందర్భంగా కూడా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. కావున మార్చి 18న సిఫార్సు లేఖలు సమర్పించే అవకాశం ఉండదు.



More Telugu News