Kalvakuntla Kavitha: తిరుపతిలో కవిత నోట ‘జై ఆంధ్ర’ నినాదం
- తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన కవిత
- రేణిగుంట విమానాశ్రయంలో జై ఆంధ్ర అంటూ నినాదం
- తన పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానని వ్యాఖ్య
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక నూతన ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కల్వకుంట్ల కవిత తిరుపతి పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చిన ఆమె... తిరుమల శ్రీవారి మొక్కు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి తిరుపతికి చేరుకున్నారు.
రేణిగుంట విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో ఆమె 'జై ఆంధ్ర' అని నినాదం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన రాక సందర్భంగా ఏపీలోని శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారని కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో తాము ప్రారంభించబోతున్న రాజకీయ పార్టీకి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానని అన్నారు.
మరోవైపు, తనను ఇబ్బంది పెట్టిన కేసుల నుంచి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. సత్యం తన వైపు ఉన్నందునే దైవకృపతో కేసుల నుంచి విముక్తి లభించిందని, ఆ మొక్కు తీర్చుకునేందుకే అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా తాను స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి శ్రీవారి ఆశీస్సులు ఉంటాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వం ప్రాతిపదికగా తన రాజకీయ ప్రయాణం ఉంటుందని చెబుతున్న కవిత, ఏపీలో 'జై ఆంధ్ర' అనడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
ముఖ్యంగా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఏపీ సెటిలర్ల ఓట్లు ఏ ఎన్నికల్లోనైనా కీలకంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో, వారిని ఆకట్టుకోవడానికి కవిత ఈ నినాదాన్ని వాడుకున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళుతున్నారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే తన కొత్త పార్టీ పేరు మరియు విధివిధానాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.