Donald Trump: ఒక్క దెబ్బకు 48 మందిని లేపేశాం: ట్రంప్

Donald Trump claims 48 Iranian leaders killed
  • అమెరికా, ఇస్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి
  • ఒకేసారి 48 మంది ఇరాన్ అగ్రనేతలను అంతం చేశామన్న ట్రంప్
  • ఇస్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడుల పరంపర
  • భారత్ నుంచి వెళ్లే 50కి పైగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
"ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ అగ్రనేతలను లేపేశాం.. ఇది మాకు అద్భుత విజయం" అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటన చేశారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. మార్చి 1 నాటికి పరిస్థితి చేజారిపోయి, పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ఇరాన్ గుండెల్లో గుబులు రేపింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద విషాదంగా మారింది.

టెహ్రాన్ నడిబొడ్డున అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. దాదాపు 1,200కు పైగా బాంబులు, ఆయుధ సామగ్రితో ఇరాన్‌పై దాడి చేశాయి. ఈ విధ్వంసంలో ఇరాన్ అగ్రనాయకత్వం కుప్పకూలింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ దాడి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఇరాన్ ఒకవేళ ప్రతీకారానికి దిగితే, ఇంతకంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇది తమ ఉనికి కోసం జరుగుతున్న యుద్ధమని, దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

అయితే, తమ నాయకుడి మరణంతో రగిలిపోతున్న ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని బీట్ షెమెష్‌పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో దాడి చేయడంతో 8 మంది మరణించారు. అటు గల్ఫ్ జలాల్లోని ఇంధన ట్యాంకర్లే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఓ ట్యాంకర్ పూర్తిగా మునిగిపోగా, మరొకటి ధ్వంసమైంది. ఈ ఘటనలో భారతీయులు కూడా గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. దుబాయ్, అబుదాబి, దోహా వంటి ప్రధాన నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మరోవైపు, ఇరాన్ తన క్షిపణులతో అమెరికా యుద్ధ నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌'పై దాడి చేశామని ప్రకటించుకుంది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ వార్తలను ఖండించింది. ఇరాన్ క్షిపణులు తమ దరిదాపుల్లోకి కూడా రాలేదని కొట్టిపారేసింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌లో తాత్కాలిక పాలక మండలి ఏర్పాటైంది. అయతోల్లా అలిరెజా అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమించారు.

ఈ యుద్ధ ప్రభావం సామాన్యులపైనా తీవ్రంగా పడుతోంది. పాకిస్థాన్‌లోని అమెరికా కాన్సులేట్ వద్ద జరిగిన నిరసనల్లో 9 మంది మరణించారు. యుద్ధం కారణంగా గగనతలం మూసివేయడంతో విమానయాన రంగం కుదేలయ్యింది. భారత్ నుంచి వెళ్లాల్సిన 50కి పైగా ఎయిర్ ఇండియా విమానాలు, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 100కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. రష్యా, చైనా ఈ దాడులను ఖండించగా... పరిస్థితి ఇంకా ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
Donald Trump
Iran
Israel
Middle East conflict
Qassem Soleimani
US military
Benjamin Netanyahu
Airstrikes
Iran supreme leader
World war

More Telugu News