Sree Vishnu: ఆసక్తి రేపుతున్న శ్రీవిష్ణు 'మృత్యుంజయ్'.. ట్రైలర్ విడుదల చేసిన ఎన్టీఆర్

Sree Vishnus Mrutyunjay Trailer Launched by Jr NTR
  • నిర్మాత సన్నీ గుణ్ణంతో తనకున్న 18 ఏళ్ల స్నేహాన్ని గుర్తుచేసుకున్న తారక్
  • ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న థ్రిల్లర్ ట్రైలర్
  • మార్చి 6న థియేటర్లలోకి రానున్న 'మృత్యుంజయ్' చిత్రం
విలక్షణ నటుడు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. తన స్నేహితుడు, ఈ చిత్ర నిర్మాత సన్నీ గుణ్ణం (సందీప్ గుణ్ణం) కోసం ఆయన ఈ ట్రైలర్‌ను లాంచ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన స్నేహితుడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "సన్నీ గుణ్ణం నా జీవితంలో చాలా ఏళ్లుగా ఒక ముఖ్యమైన వ్యక్తి. మా 18 ఏళ్ల స్నేహంలో వాళ్ల నాన్నగారు గుణ్ణం గంగరాజు గారి లాగే ప్రత్యేకమైన కథలను గుర్తించడంలో సన్నీకి మంచి పట్టు ఉందని గమనించాను. అలాంటి ఒక ప్రత్యేకమైన కథతో నిర్మాతగా తన తొలి అడుగు వేస్తున్నందుకు గర్వంగా ఉంది. 'మృత్యుంజయ్' ట్రైలర్ గ్రిప్పింగ్ ఇంటెన్సిటీతో ఉత్కంఠ రేపుతూ, సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మార్చి 6న విడుదలవుతున్న ఈ సినిమాకు దర్శకనిర్మాతలతో పాటు శ్రీవిష్ణుకు, చిత్ర బృందానికి గొప్ప విజయం దక్కాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. "నా చేతులు ముళ్లతో కూడిన తాడుతో కట్టేసి ఉన్నాయి. ఆ ముళ్లు విప్పి నీ ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెబుతాను. ఇది నా ప్రామిస్" అంటూ శ్రీవిష్ణు ఒక చిన్నారితో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. క్రైమ్ బ్యూరోలో పోస్టింగ్ కోసం తన పై అధికారితో ఆయన వాదించడం చూస్తుంటే, ఇందులో శ్రీవిష్ణు జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పోలీస్ అధికారిణి పాత్రలో ఉన్న రెబా జాన్ ఒక మరణాన్ని "దురదృష్టకరమైన ప్రమాదం"గా కొట్టిపారేయగా, శ్రీవిష్ణు మాత్రం అది ప్రమాదం కాదని వాదిస్తాడు. పోలియో సోకిన ఎడమ కాలు ఉన్న వ్యక్తి కోసం హీరో వెతకడం, "ఓడిపోతానేమో అని భయంగా ఉంది" అని శ్రీవిష్ణు తన అత్తతో చెప్పినప్పుడు.. "ఓడిపోవడం తప్పు కాదు. కానీ ఓడిపోతామనే భయంతో పోరాడకపోవడమే తప్పు" అని ఆమె చెప్పే సంభాషణలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల‌ 27న విడుదల చేయాలని భావించినా, కొన్ని కారణాల వల్ల మార్చి 6కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని శ్రీవిష్ణు తన ఇన్‌స్టాగ్రామ్‌లో "రిలీజ్ డేట్ మారింది, థ్రిల్ కాదు!" అనే క్యాప్షన్‌తో ప్రకటించారు. లైట్ బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ చిత్రానికి రమ్య గుణ్ణం సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. కాలభైరవ సంగీతం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Sree Vishnu
Mrutyunjay
Reba John
Jr NTR
Hussain Sha Kiran
Telugu movie trailer
suspense thriller
crime thriller
Kolabairava music
Sunny Gunnam

More Telugu News