Nara Lokesh: పవన్ కల్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే!: మంత్రి నారాలోకేశ్

Nara Lokesh Says Pawan Kalyan is His Elder Brother Forever
  • ముంబైలో ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా - 2026’ సదస్సు
  • పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ 
  • ఏబీపీ జర్నలిస్ట్ మేఘా ప్రసాద్‌తో జరిగిన ఫైర్ సైడ్ చాట్‌
  • ఆసక్తికర సమాధానాలు చెప్పిన నారా లోకేశ్
 అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశాన్ని బలోపేతం చేస్తాయని, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ముంబైలో ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా - 2026’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీపీ జర్నలిస్ట్ మేఘా ప్రసాద్‌తో జరిగిన ఫైర్ సైడ్ చాట్‌లో ఆయన ఏపీ అభివృద్ధి ప్రణాళికలు, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మాట ఇస్తే అది జరిగి తీరుతుందని, ఆయన నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని లోకేశ్ అన్నారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, సవాళ్లను ఇష్టంగా స్వీకరిస్తామని తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనకు బిగ్ బ్రదర్ అని, జీవితాంతం తనకు పెద్దన్నేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఒకే రాజధాని.. క్లస్టర్లతో అభివృద్ధి వికేంద్రీకరణ
"మేము కేవలం ఒక నగరాన్ని మాత్రమే నిర్మించడం లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదాన్ని బలంగా నమ్ముతాం. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను ఆర్థిక రీజియన్లుగా అభివృద్ధి చేస్తూ, వాటి పరిధిలో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నాం," అని లోకేశ్ వివరించారు. క్లస్టర్ విధానాన్ని వివరిస్తూ, "ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఫాక్స్‌కాన్ లాంటి ఒక కంపెనీని తీసుకురావడమే కాకుండా, ఐఫోన్ అసెంబుల్‌కు అవసరమైన అన్ని విడిభాగాల తయారీదారులను ఒకేచోటకు తీసుకురావడమే మా వ్యూహం. దీని ద్వారా అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరించడం సుసాధ్యమవుతుంది" అని తెలిపారు.

‘నమో’ సర్కార్‌తో పెట్టుబడుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. "ఒకటి, అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు... రెండవది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కేవలం 17 నెలల్లోనే దేశంలోనే అతిపెద్దదైన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు అన్ని అనుమతులు ఇచ్చాం. మార్చి మూడోవారంలో దానికి శంకుస్థాపన చేయబోతున్నాం. మూడవది, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ఢిల్లీలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం నాయుడు కలయికను నేను ‘నమో’ (నాయుడు-మోదీ) అని పిలుస్తాను. ఈ నాయకత్వం వల్లే భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి వచ్చాయి" అని ఆయన గణాంకాలతో వివరించారు.

భూమి కన్నా ఎకోసిస్టమ్ విలువైంది
ఫార్చూన్ 500 కంపెనీలను ఆకర్షించేందుకు ఎకరా భూమిని 99 పైసలకే ఇస్తున్నామని, తాము ఇచ్చే భూమి విలువ కన్నా ఆ కంపెనీల రాకతో ఏర్పడే ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగ కల్పన ఎన్నో రెట్లు అధికమని లోకేశ్ తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీని ఉదాహరణగా చూపుతూ, "విశాఖలో ఆ కంపెనీ ఏర్పాటుతో 25,000 ఉద్యోగాలు వస్తాయి. ఏటా రూ.1500 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి. భూమి విలువ కన్నా రాష్ట్రానికి వచ్చే ఈ ప్రయోజనం ఎంతో పెద్దది" అని స్పష్టం చేశారు.

అమరావతే భవిష్యత్తు.. దేశానికి గర్వకారణం
అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని, ఇది భవిష్యత్తుకు చిరునామా అని లోకేశ్ అన్నారు. "పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏపీకి రాకపోతే, భవిష్యత్తులో ఎందుకు రాలేకపోయామని బాధపడతారు. ప్రతి వంద రోజులకు ఒకసారి అమరావతికి వచ్చి చూడండి. అక్కడ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మీకే తెలుస్తుంది. భారతదేశం గర్వించేలా రాజధానిని నిర్మిస్తున్నాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడామని, ప్రస్తుతం అది లాభాల బాటలో పయనిస్తోందని తెలిపారు. తాము సమిష్టి సమాఖ్య స్ఫూర్తిని విశ్వసిస్తామని, డేటా సెంటర్ పాలసీ రూపకల్పనలో కేంద్రంతో కలిసి పనిచేసి దేశవ్యాప్తంగా ప్రయోజనం చేకూర్చే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామని లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
AP Development
Investments AP
Amaravati
Visakhapatnam
AP Economy
Ideas of India 2026

More Telugu News