పేదవాళ్ల ఇళ్లను కూలుస్తూ.. వేల కోట్లతో పార్కులా?: రేవంత్ సర్కార్‌పై ఈటల ధ్వజం

Etela Rajender slams Revanth govt over demolishing houses for parks

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ ప్రభుత్వం బడుగు జీవుల ఉసురు పోసుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, మూసీ ప్రక్షాళన పేరుతో వందలాది ఇళ్లను నేలమట్టం చేస్తున్నారని, మధుపార్క్‌ వంటి అపార్ట్‌మెంట్లలో నివసించే వారి ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా అని నిలదీశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, పేదలకు కొత్తగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా, ఉన్న నీడను లాక్కోవడం దారుణమని ధ్వజమెత్తారు.


ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలు, విద్యార్థుల డైట్ ఛార్జీలకు నిధులు లేవని చెబుతున్న సర్కారు... వేల కోట్లు వెచ్చించి గాంధీ పార్కు నిర్మించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. "బడా బాబులు వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకుంటున్న పాలకులు, సామాన్యుడిపై మాత్రం జులుం ప్రదర్శిస్తున్నారు. కూకట్‌పల్లి ఎల్లమ్మబండ వద్ద 120 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనా పట్టించుకునే నాథుడే లేడు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ గాంధీ పార్కు కట్టాలనుకుంటే, కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన భూముల్లో నిర్మించుకోవాలి కానీ, పేదల ఇళ్లను పడగొట్టి కాదని అన్నారు.


తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని, ఇక్కడి 'దుర్మార్గాలను' తక్షణమే అరికట్టాలని ఈటల డిమాండ్ చేశారు. పేదల పొట్టకొట్టి చేస్తున్న ఈ అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, ఇదే తీరు కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి తక్షణమే ప్రత్యామ్నాయం చూపాలని, లేనిపక్షంలో బాధితుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Go Back to Shorts
Etela Rajender
Revanth Reddy
Telangana government
housing for poor
Musi River
Gandhi Park
Congress party
Kukatpally
Rahul Gandhi
land encroachment

More Telugu News