Chandrababu Naidu: ఇది మహాపచారం... గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం దుర్మార్గం: కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Ghee Adulteration Scandal in TTD
  • టీటీడీ నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందన్న సీఎం చంద్రబాబు
  • పక్కా ప్రణాళికతో నిబంధనలు మార్చి అనర్హులైన సంస్థలకు టెండర్లు
  • జంతువుల కొవ్వు, రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని ఆరోపణ
  • సిట్ నివేదికలోని అంశాలను, ఆధారాలను అసెంబ్లీలో బయటపెట్టిన ముఖ్యమంత్రి
  • టీటీడీ చైర్మన్ పీఏ ఖాతాలో రూ.4.69 కోట్ల లంచం డబ్బు దొరికిందన్న చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందని, ఇది దేవుడికే అపచారం చేసిన మహా పాపమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికలో సంచలన విషయాలు ఆధారాలతో సహా ఉన్నాయని అన్నారు. పక్కా ప్రణాళికతో, వ్యవస్థీకృతంగా ఈ స్కామ్‌కు పాల్పడ్డారని, శ్రీవారి నైవేద్యానికి వాడే నెయ్యిని ప్రమాదకరమైన రసాయనాలు, జంతువుల కొవ్వుతో కల్తీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడి విషయంలో జరిగిన ఈ మహా పాపంపై గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకుండా, బుకాయించడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.

నిబంధనల మార్పుతో మొదలైన కుట్ర 
ఈ కుంభకోణానికి బీజం టెండర్ నిబంధనల మార్పుతోనే పడిందని చంద్రబాబు వివరించారు. తమకు అనుకూలమైన, అనర్హత ఉన్న సంస్థలకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు గత ప్రభుత్వం నిబంధనలను పూర్తిగా నీరుగార్చిందని ఆరోపించారు. 

రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలనే నిబంధనను పూర్తిగా తొలగించారు. నెయ్యి తయారీలో అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించారు. డైరీల వార్షిక టర్నోవర్‌ను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్ వంటి కీలక ప్రక్రియలకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. ఈ మార్పులతో అర్హత లేని 'బోలే బాబా', 'వైష్ణవి డైరీ' వంటి షెల్ కంపెనీలకు నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించారని సీఎం పేర్కొన్నారు.

జంతువుల కొవ్వు, డిటర్జెంట్లతో కల్తీ 
సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని, అది రసాయనాల మిశ్రమమని సిట్ నివేదికలోని అంశాలను చంద్రబాబు ఉటంకించారు. నెయ్యి తయారీకి రిఫైన్డ్ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్‌ను బేస్‌గా వాడారని తెలిపారు. రంగు కోసం 'బీటా కెరాటిన్', వాసన కోసం 'ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్', నురుగు కోసం డిటర్జెంట్లలో వాడే 'లబ్సా యాసిడ్' వంటి ప్రమాదకర రసాయనాలు వాడినట్లు వెల్లడించారు. 

అంతేకాకుండా, 2024 జూలైలో వచ్చిన ఎన్డీబీ నివేదిక ప్రకారం నెయ్యిలో జంతువుల కొవ్వు (బీఫ్ టాలో) అవశేషాలు ఉన్నట్లు తేలిందని, ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల లంచాలు, నివేదికల తొక్కివేత
 ఈ మొత్తం వ్యవహారంలో భారీగా లంచాలు చేతులు మారాయని చంద్రబాబు ఆరోపించారు. అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలో రూ.4.69 కోట్ల లంచం డబ్బును సిట్ గుర్తించిందని తెలిపారు. కిలో నెయ్యికి రూ.25 చొప్పున చిన్నపన్న కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించారు. 

ప్లాంట్ తనిఖీలకు వెళ్లిన అధికారులకు ఖరీదైన ఫోన్లు, బంగారం, వెండి నాణేలు లంచంగా ఇచ్చి అనుకూల నివేదికలు తెచ్చుకున్నారని అన్నారు. 2022లోనే సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ అని (బీటా సిటోస్ట్రాల్ పాజిటివ్) స్పష్టంగా ఉన్నా, అప్పటి టీటీడీ బోర్డు ఆ నివేదికను తొక్కిపెట్టిందని చంద్రబాబు ఆరోపించారు. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినప్పటికీ 'బోలే బాబా' సంస్థ 'వైష్ణవి', 'మాల్గంగ' వంటి షెల్ కంపెనీల ద్వారా కల్తీ నెయ్యి సరఫరాను కొనసాగించిందని వివరించారు.

సిట్ దర్యాప్తులో భాగంగా నకిలీ ల్యాబ్ రిపోర్టులు, ఫేక్ ఇన్వాయిస్‌లు, లంచాల వివరాలున్న డైరీలు, రసాయనాల డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులో నేరపూరిత కుట్ర (120బి), ఆహార కల్తీ (272, 273), మోసం (420), మత మనోభావాలను దెబ్బతీయడం (295a), అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చంద్రబాబు సభకు వివరించారు. 
Chandrababu Naidu
TTD
Tirumala
Ghee Adulteration
Andhra Pradesh Assembly
YV Subba Reddy
SIT Investigation
Bole Baba Dairy
Vaishnavi Dairy
Corruption

More Telugu News