Air ambulance crash: అప్పు చేసి మృత్యువును కొనుక్కున్నట్టయింది.. ఎయిర్ ఆంబులెన్స్ ప్రమాదంలో విషాదం
- భర్త ప్రాణం కాపాడుకోవడానికి 8 లక్షలు అప్పు చేసి ఎయిర్ ఆంబులెన్స్ బుక్ చేసిన భార్య
- విమానం కూలడంతో రోగి, అతడి భార్య, మరో బంధువు మృతి
- ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది కూడా దుర్మరణం
గుండెను పిండేసే నేపథ్యం..
ఝార్ఖండ్లోని లాతేహార్ జిల్లా చాంద్వాకు చెందిన సంజయ్ (41) ఒక చిన్న హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత వారం తన హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు (65% కాలిన గాయాలు). స్థానిక ఆసుపత్రిలో చికిత్స ఫలించకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
చివరి ఆశగా ఎయిర్ అంబులెన్స్..
పేదరికంలో ఉన్నప్పటికీ సంజయ్ను బతికించుకోవాలనే ఆశతో ఆ కుటుంబం తెలిసిన వారి దగ్గర దాదాపు రూ.8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్ను ఏర్పాటు చేసింది. సోమవారం సాయంత్రం రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానంలో సంజయ్తో పాటు అతడి భార్య అర్చన, బంధువు ధ్రువ్ కుమార్ కూడా ఉన్నారు.
అర్ధాంతరంగా ముగిసిన ప్రయాణం..
రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాలకే వాతావరణం అనుకూలించక విమానం చత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సంజయ్, అతడి భార్య అర్చన దేవి, బంధువు ధ్రువ్ కుమార్ తో పాటు ఇద్దరు పైలట్లు, ఒక డాక్టర్ మరియు పారామెడికల్ సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. అప్పు చేసి మరీ ప్రాణాలు కాపాడుకోవాలనుకున్న ఆ ప్రయత్నం ఇలా విషాదాంతం అవ్వడం స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది.