Chandrababu Naidu: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

Chandrababu Naidu Serious on Rajahmundry Adulterated Milk Incident
  • రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • ఈ ఘటనలో నలుగురు మృతి, 13 మందికి పైగా అస్వస్థత
  • బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం
  • ల్యాబ్ రిపోర్టుల తర్వాత నిందితులపై కఠిన చర్యలని స్పష్టం
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలాచెరువు ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించగా, 13 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో చాలామంది కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో (అనూరియా) బాధపడుతున్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పాలు సరఫరా చేసిన కొరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే విక్రేతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 106 కుటుంబాలపై సర్వే చేపట్టారు. 75 మంది నుంచి రక్త, మూత్ర నమూనాలతో పాటు, పాల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం విశాఖపట్నం ల్యాబ్‌కు పంపారు. ఈ ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Chandrababu Naidu
Rajahmundry
adulterated milk
milk contamination
Andhra Pradesh
health crisis
food safety
police investigation
kidney failure
বিশాఖపట్నం lab

More Telugu News