YS Sharmila: బీజేపీకి కొత్త అర్థం చెప్పిన షర్మిల... చంద్రబాబు, జగన్ పై తీవ్ర విమర్శలు

YS Sharmila Criticizes BJP Alliance with Chandrababu and Jagan
  • చంద్రబాబు, జగన్‌లు బీజేపీకి బానిసలుగా మారారని షర్మిల విమర్శ
  • మోదీ చైనా రోబోను ప్రదర్శించినప్పుడు వీరి నోళ్లు పెగల్లేదని ఎద్దేవా
  • చంద్రబాబుది అధికారిక పొత్తు కాగా, జగన్‌ది బీజేపీతో అక్రమ పొత్తు అని ఆరోపణ
  • రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు-జగన్-పవన్ అంటూ కొత్త నిర్వచనం
  • రైతుల కోసం కాంగ్రెస్ నిరసన చేస్తుంటే ఉగ్రకోణం అంటారా అని ఫైర్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారిద్దరూ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రచారకర్తలుగా, బీజేపీ ఎదుట బానిసలుగా మారారని, స్వప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే తోలుబొమ్మలని ఆమె తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబుది బీజేపీతో అధికారిక పొత్తు అయితే, జగన్‌ది అక్రమ పొత్తు అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు-జగన్-పవన్ అని, వీరంతా మోదీ కోసం పనిచేస్తున్నారని షర్మిల ఆరోపించారు.

ఈ సందర్భంగా షర్మిల స్పందిస్తూ... "ఏఐ సదస్సు వేదికగా ప్రధాని మోదీ ఒక చైనా రోబో బొమ్మను ప్రదర్శించి 70 దేశాల ముందు దేశ ప్రతిష్ఠను దిగజార్చారు. భారతీయ ప్రతిభను తొక్కిపెట్టి చైనా ఉత్పత్తులను చూపించి దేశానికి అవమానం తలపెట్టినప్పుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడి నోళ్లు ఎందుకు పెగల్లేదు? అప్పుడు వారికి సిగ్గుగా అనిపించలేదా? కాంగ్రెస్ నిరసనలు తెలిపినప్పుడు మాత్రం వారి నోర్లు పెగిలాయి" అని వ్యాఖ్యానించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, బాధ్యత గురించి బాబు, ఐక్యత గురించి జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ దేశం కోసం పోరాడుతుంటే మద్దతివ్వాల్సింది పోయి, అధికార పక్షానికి వంత పాడటం సిగ్గుచేటన్నారు. "ట్రంప్ పర్యటన సందర్భంగా అమెరికా ప్రయోజనాల కోసం సున్నా సుంకాలకు ఒప్పుకొని భారత రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టారు. ఇది రైతాంగానికి మరణశాసనం లాంటి బ్లాక్ డీల్ అని, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని చెబుతూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ నిరసన తెలిపింది. ఈ వాస్తవాన్ని చంద్రబాబు, జగన్ అర్థం చేసుకోకపోవడం వారి అవివేకం" అని షర్మిల పేర్కొన్నారు.

ప్రజల్లో కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతుండటం చూసి ఓర్వలేకే బీజేపీ తమ నిరసనకు ఉగ్రవాద కోణాన్ని అంటగడుతోందని, ఇది కేంద్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. మోదీ కాషాయ కామెర్లు సోకిన వారు ఇలా కాకుండా ఎలా మాట్లాడతారని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
YS Sharmila
Andhra Pradesh Congress
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Narendra Modi
BJP alliance
AP Politics
Congress Party
Political criticism
Indian economy

More Telugu News