Revanth Reddy: నేను పార్టీ అధ్యక్షుడిని అయ్యే నాటికి పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy Party Condition Was Critical When I Became President
  • పార్టీలో కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నానని తెలిపిన రేవంత్ రెడ్డి
  • నేతలందరినీ కలిసి తన ఆలోచన చెప్పి వారిని ఒప్పించానన్న ముఖ్యమంత్రి
  • అందరి కృషి వల్ల తెలంగాణలో పార్టీ తిరిగి పుంజుకున్నదన్న ముఖ్యమంత్రి
తాను టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే నాటికి పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో కూడా కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నానని, నేతలందరినీ కలిసి తన ఆలోచన చెప్పి వారిని ఒప్పించానని గుర్తుచేసుకున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి భిన్నాభిప్రాయాలు వెలువరించే స్వేచ్ఛ ఉందని అన్నారు. భిన్నాభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వారిని వేధించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదని వెల్లడించారు. మనలో మనం కొట్టుకుంటే పార్టీలో కష్టపడి పనిచేసే లక్షలాది మంది కార్యకర్తలకు అన్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. అందరి కృషి వల్లే తెలంగాణలో పార్టీ తిరిగి పుంజుకున్నదని అన్నారు.

డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చామని, ఎమ్మెల్యే టిక్కెట్లు రాని వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చామని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన మరో అరవై మందికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పార్టీలో అందరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని హెచ్చరించారు. పార్టీ కోసం శ్రమించే వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. మెరిట్ ప్రకారమే పార్టీలో అవకాశాలు వస్తాయన్నారు.

డీసీసీ పదవి ఎంతో విలువైనదని, దీనిని ఏమాత్రం దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు. మంచి ప్రతిభ కనబరిస్తే ఆ తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి కూడా కావొచ్చని అన్నారు. నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల మధ్య రోజుల తరబడి ఉన్నారని అన్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. మోతీలాల్ నెహ్రూ దేశం కోసం వేల కోట్ల రూపాయలను ఆ రోజుల్లోనే త్యాగం చేశారని, జవహర్ లాల్ నెహ్రూ జైల్లో ఉన్నారని తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు.
Revanth Reddy
Telangana Congress
TPCC
DCC Presidents Training
Congress Party
Telangana Politics
YS Rajasekhara Reddy
Rahul Gandhi
Motilal Nehru
Jawaharlal Nehru

More Telugu News