Sridhar Rao: కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ఏపీ ప్రభుత్వ సలహాదారుగా శ్రీధర్ నియామకం
- సమాచార ప్రచార విభాగం సలహాదారుడిగా శ్రీధర్
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
తెలుగు పాఠకులకు ఈనాడు కార్టూన్ల ద్వారా బాగా పరిచితులైన మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టింది. ప్రభుత్వ సలహాదారుగా (సమాచార ప్రచార విభాగం) ఆయనను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీధర్ రావు రెండేళ్ల పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉంటారు. కేబినెట్ మంత్రి స్థాయిలో ఆయనకు జీతభత్యాలు, అలవెన్సులు వర్తిస్తాయి. ‘ఈనాడు’ దినపత్రికలో తన మార్క్ కార్టూన్లతో గుర్తింపు పొందిన శ్రీధర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై తన కార్టూన్లతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ఆయనకు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా అవకాశం లభించడం విశేషం.