టీ20 వరల్డ్ కప్: ఇటలీపై వెస్టిండీస్ విక్టరీ... అజేయంగా సూపర్-8లోకి!

  • టీ20 ప్రపంచకప్‌లో ఇటలీపై 42 పరుగులతో గెలిచిన వెస్టిండీస్
  • గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సూపర్‌ 8కి చేరిన విండీస్
  • 75 పరుగులతో రాణించిన కెప్టెన్ షాయ్ హోప్
  • నాలుగు వికెట్లతో ఇటలీని దెబ్బతీసిన పేసర్ షామార్ జోసెఫ్
  • తొలుత విండీస్ 165 పరుగులు చేయగా, ఇటలీ 123 పరుగులకే ఆలౌట్
టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగించింది. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఇటలీపై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా సూపర్‌ 8 దశలో ప్రవేశించింది. తొలుత కెప్టెన్ షాయ్ హోప్ (75) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు, బౌలింగ్‌లో షామార్ జోసెఫ్ (4/30), మాథ్యూ ఫోర్డ్ (3/25) చెలరేగడంతో విండీస్ విజయం సునాయాసమైంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్, హెట్‌మెయర్ త్వరగా ఔటయ్యారు. అయితే, కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. రోస్టన్ చేజ్ (24)తో కలిసి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (24), మాథ్యూ ఫోర్డ్ (16) వేగంగా ఆడటంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఇటలీ బౌలర్లలో క్రిషన్ కాలుగమగే, బెన్ మనేంటీ చెరో రెండు వికెట్లు తీశారు.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీకి ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. పవర్‌ప్లే ముగిసేసరికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జేజే స్మట్స్ (24), బెన్ మనేంటీ (26) కాసేపు పోరాడినా, విండీస్ బౌలర్ల ధాటికి ఇటలీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా పేసర్ షామార్ జోసెఫ్ నాలుగు వికెట్లతో ఇటలీ పతనాన్ని శాసించాడు. అతనికి మాథ్యూ ఫోర్డ్ మూడు వికెట్లతో, గుడకేశ్ మోటీ రెండు వికెట్లతో చక్కటి సహకారం అందించారు. దీంతో ఇటలీ 18 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది.


More Telugu News