టీ20 వరల్డ్ కప్: గ్రూప్ దశను అజేయంగా ముగించిన భారత్... నెదర్లాండ్స్ పై విజయం

  • టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై భారత్  17 పరుగుల తేడాతో విజయం
  • ఆల్ రౌండర్ శివమ్ దుబే అద్భుత ప్రదర్శన
  • బ్యాటింగ్‌లో 66 పరుగులు, బౌలింగ్‌లో 2 వికెట్లు తీసిన దుబే
  • మూడు వికెట్లతో సత్తా చాటిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
  • గ్రూప్-ఏలో చివరి లీగ్ మ్యాచ్‌ను విజయంతో ముగించిన టీమిండియా
టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో శివమ్ దుబే ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. బ్యాటింగ్‌లో అద్భుత అర్ధశతకం సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గ్రూప్-ఏలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి, ఓటమన్నదే లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టనుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు నెదర్లాండ్స్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే అభిషేక్ శర్మ (0) వికెట్ కోల్పోయినప్పటికీ, ఇషాన్ కిషన్ (18) వేగంగా ఆడాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (31), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (34) నిలకడగా రాణించారు. అయితే, అసలు సిసలు విధ్వంసం సృష్టించింది శివమ్ దూబేనే. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (30) కూడా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 3, ఆర్యన్ దత్ 2 వికెట్లు తీశారు.

194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ గట్టిగానే పోరాడింది. బాస్ డి లీడ్ (33), కోలిన్ అకెర్‌మాన్ (23), జాక్ లయన్-కాచెట్ (26) రాణించారు. అయితే, భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. శివమ్ దూబే బంతితోనూ రాణించి 2 వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తద్వారా 4 మ్యాచ్ ల్లో 4 విజయాలతో గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచింది. 

సూపర్-8లో గ్రూప్-1లో ఉన్న భారత్... ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్ తో తలపడనుంది. 


More Telugu News