Himanta Biswa Sarma: కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. పాత గాయాలను కెలికిన హిమంత

Himanta Biswa Sarma Reveals Congress Power Struggle
షార్ట్స్‌లో చూడండి
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ పార్టీలో తన పాత రోజులను గుర్తుచేసుకుంటూ సంచలన విషయాలు వెల్లడించారు. 2014లో తాను ముఖ్యమంత్రి కావడానికి అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించినా, రాహుల్ గాంధీ జోక్యంతో ఆ అవకాశం చేజారిపోయిందని ఆయన ఆరోపించారు.

మంగళవారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన హిమంత ఆనాటి రాజకీయ పరిణామాలను వివరించారు. "అప్పట్లో 58 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాకు మద్దతుగా నిలిచారు. స్వయంగా సోనియా గాంధీ నన్ను పిలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు చేసుకోమని చెప్పారు. కామాఖ్య ఆలయంలో అంబుబాచి మేళా ముగిశాక బాధ్యతలు చేపడతానని కూడా ఆమెతో చెప్పాను" అని హిమంత తెలిపారు. అయితే, ఆ సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ చేసిన కొన్ని ఫోన్ కాల్స్‌తో పరిస్థితి మొత్తం తలకిందులైందని ఆరోపించారు.

ఆనాడు తనకు అన్యాయం జరిగిందని అంగీకరించినప్పటికీ, ఇప్పుడు ఆ సంఘటనను మరో కోణంలో చూస్తున్నట్లు హిమంత తెలిపారు. "ఒకవేళ నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే, సనాతన ధర్మానికి, అస్సాం ప్రజలకు ఇంత సేవ చేసేవాడిని కాదేమో. నన్ను సీఎం కానివ్వకుండా అడ్డుకున్నందుకు రాహుల్ గాంధీకి నా ధన్యవాదాలు. అందుకే ఇప్పుడు బీజేపీ సీఎంగా గర్వంగా ఉన్నాను" అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదిలా ఉండగా, అసోంలో 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మాజీ అధ్యక్షుడు, 32 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న భూపేన్ బోరా, ఫిబ్రవరి 22న అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు లఖింపూర్, గువాహటి ప్రాంతాలకు చెందిన మరికొందరు నేతలు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 
Go Back to Shorts
Himanta Biswa Sarma
Assam
Congress
Rahul Gandhi
Sonia Gandhi
BJP
Assam Politics
Bhupen Bora
Assam Assembly Elections 2026
Political News

More Telugu News