హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. టిప్పర్ కిందపడి విద్యార్థి మృతి

  • నాదర్‌గుల్ నుంచి కాలేజీకి బైక్ పై వెళుతుండగా దుర్ఘటన
  • టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన విద్యార్థి
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు. నాదర్‌గుల్ నుంచి కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని నాదర్‌గుల్ నివాసి వర్ధన్‌గా గుర్తించారు.

వర్ధన్ బాలాపూర్‌లోని ఒక ప్రైవేటు కాలేజీలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ద్విచక్ర వాహనంపై కాలేజీకి వెళుతుండగా టిప్పర్, ఆటో మధ్యలో నుంచి వాటిని దాటే ప్రయత్నంలో టిప్పర్ ముందు చక్రం కిందపడి మృతి చెందాడు.

వర్ధన్ టిప్పర్‌ను దాటుదామనుకున్న సమయంలో ఆటో నిలబడి ఉంది. కానీ అంతలోనే ఆటో కదలడంతో బైక్‌ను కొద్దిగా టిప్పర్ వైపు తిప్పడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News