కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ.. ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్

  • మేయర్‌గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్
  • శ్రీనివాస్‌కు 34, కాంగ్రెస్ అబ్యర్థి నర్మదకు 21 ఓట్లు
  • కాంగ్రెస్‌కు మద్దతు పలికిన మజ్లిస్, ఇతరులు
పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన కరీంనగర్ కార్పొరేషన్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది.  కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది.

బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి నర్మదకు 21 ఓట్లు వచ్చాయి. తొమ్మిది స్థానాలు ఉన్న బీఆర్ఎస్ ఎన్నికను బహిష్కరించింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 స్థానాలు ఉండగా, బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, మజ్లిస్ 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. బీఆర్ఎస్, మజ్లిస్, స్వతంత్రులతో కలిపి కరీంనగర్ కార్పొరేషన్‌ను దక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది.

కరీంనగర్ కార్పొరేషన్‌లో తమకు అధికారానికి కావాల్సిన స్థానాలు దక్కలేదు కాబట్టి తాము మేయర్ ఎన్నికను బహిష్కరించామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెల్లడించారు. తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించామని అన్నారు. తమకు మెజారిటీ స్థానాలు వస్తే తాము మేయర్ పదవి కోసం బరిలో నిలిచేవాళ్లమని వెల్లడించారు.


More Telugu News