మొదటి శుభలేఖ మామయ్య చిరంజీవికి అందించిన అల్లు శిరీష్.. చేతికి బ్యాండేజ్ తో కనిపించిన మెగాస్టార్!

  • త్వరలో నయనికా రెడ్డితో అల్లు శిరీష్ వివాహం
  • చిరంజీవి ఆశీస్సులు అందుకున్న అల్లు హీరో
  • కొనసాగుతున్న పెళ్లి పనులు
యంగ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి పనులు అధికారికంగా మొదలయ్యాయి. తన వివాహ మహోత్సవానికి సంబంధించిన తొలి శుభలేఖను ఆయన తన మామయ్య, మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. నయనికా రెడ్డితో త్వరలో ఏడడుగులు నడవనున్న శిరీష్, కుటుంబంలో పెళ్లి వేడుకలకు శ్రీకారం చుట్టారు.

అల్లు శిరీష్ తన తల్లిదండ్రులైన అల్లు అరవింద్, నిర్మలతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. తన మేనత్త సురేఖ, చిరంజీవి దంపతులకు పెళ్లి పత్రికను ఇచ్చి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఫొటోలను శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. "మా సంప్రదాయం ప్రకారం, మామయ్య చిరంజీవి గారికి, అత్త సురేఖ గారికి మొదటి పెళ్లి పత్రిక ఇచ్చాం" అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిరీష్ నుంచి శుభలేఖ అందుకుంటున్న సమయంలో చిరంజీవి చేతికి బ్యాండేజ్‌తో కనిపించారు. దాంతో, చిరంజీవి చేతికి ఏమైంది? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే అల్లు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే 'పసుపు' (హల్దీ) వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరై సందడి చేశారు. పసుపు రంగు బంతిపూలతో అల్లు వారి నివాసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే, తన సోదరుడి హల్దీ వేడుకకు అల్లు అర్జున్ హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, 'నేను అక్కడ లేకపోవడం మిస్ అవుతున్నాను' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కొద్ది రోజుల క్రితం దుబాయ్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి తదితరుల సమక్షంలో అల్లు శిరీష్, నయనికాల ప్రీ-వెడ్డింగ్ యాచ్ట్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు శుభలేఖల పంపిణీ మొదలవడంతో త్వరలోనే పెళ్లి తేదీపై స్పష్టత రానుంది.


More Telugu News