మా డబ్బు, గిఫ్ట్‌లు మాకివ్వండి: ఇంటింటికి వెళ్లి అడుగుతున్న ఓడిపోయిన అభ్యర్థులు

  • ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు బహుమతులు ఇచ్చిన అభ్యర్థులు
  • మూడుచింతలపల్లి, మంచిర్యాల, భువనగిరిలో బహుమతులు వెనక్కి అడుగుతున్న అభ్యర్థులు
  • ఇంటింటికి తిరిగి వసూలు చేసే ప్రయత్నం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు అభ్యర్థులు తాము పోలింగ్‌కు ముందు పంచిన నగదు, చీరలు, ఇతర బహుమతులు ఇవ్వాలంటూ ఓటర్లను అడగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బుతో పాటు ఇతర బహుమతులు పంచుతుంటారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి పొన్నాల వార్డులో ఓ అభ్యర్థి తాను పంచిన వాటిని తిరిగివ్వాలని ఓటర్లను అడుగుతున్నారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన మందు, చీరలు, డబ్బు తిరిగి ఇవ్వాలని ఈ వార్డులో ఓడిపోయిన ఓ అభ్యర్థి అడుగుతున్నారు. సదరు అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ తన బహుమతులు వసూలు చేసుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లోని తొమ్మిదవ వార్డులో కూడా ఓ అభ్యర్థి తనకు ఎవరెవరు ఓటు వేశారు, ఎవరు వేయలేదో ఇంటింటికి వెళ్లి లెక్కలు వేసుకుంటున్నారు. తనకు ఓటు వేయని వారు తాను ఇచ్చిన బహుమతులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీలోనూ ఒకటో వార్డులో ఓడిపోయిన ఒక అభ్యర్థి తాను పంచిన చీరలు, హాట్ బాక్సులు తిరిగి ఇవ్వాలని ఇంటింటికి వెళుతున్నారు.


More Telugu News