Kavitha: ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: బీఆర్ఎస్ పార్టీకి కవిత హెచ్చరిక

Kavitha Warns BRS Party This Is Just Trailer Real Movie Ahead
  • తాము రాజకీయ పార్టీగా మారబోతున్నట్లు తెలియగానే బీఆర్ఎస్ ట్రోలింగ్ చేసిందని ఆగ్రహం
  • బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోవాలని కవిత సూచన
  • వడ్డేపల్లిలో ఏఐఎఫ్‌బీ, తెలంగాణ జాగృతి కలిసి విజయం సాధించిందన్న కవిత
తమ సంస్థ రాజకీయ పార్టీగా మారబోతుందని ప్రకటించగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు తమను ట్రోలింగ్ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కానీ తమను లక్ష్యంగా చేసుకున్న వారికి ఒకటే విషయం చెబుతున్నానని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. ఇప్పుడే తొందరపడి మాట జారవద్దని, తమపై కారుకూతలు కూయవద్దని బీఆర్ఎస్ వారిని హెచ్చరించారు.

ఇప్పటికైనా మీ తప్పులను సరిదిద్దుకోవాలని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారు ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో 90 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి 16 స్థానాలకే పరిమితమైందని కవిత గుర్తు చేశారు. ప్రజల మద్దతును ఎందుకు కోల్పోయామో బీఆర్ఎస్ ఆలోచించాలని సూచించారు.

ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేసిందని కవిత ఆరోపించారు. ఆ రెండు పార్టీల పొత్తుకు ఇది తొలి మెట్టు అన్నారు. కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయిన సీపీఐకి కొత్తగూడంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతివ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌పై సాంబశివరావు చేసిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా అని బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. 

తెలంగాణలో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేశారని అన్నారు. ఆ లోటును తెలంగాణ జాగృతి భర్తీ చేస్తుందని కవిత పేర్కొన్నారు. బీజేపీ కరీంనగర్‌లో తప్ప ఎక్కడా గెలవలేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ రూ.30 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. తమకు 17 స్థానాలు రావడమే చాలా ఎక్కువ అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడటం విచిత్రమని కవిత అన్నారు.

గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.

వడ్డేపల్లి మున్సిపాలిటీ విజయంపై కవిత

జాగృతి రాజకీయ పార్టీగా మారబోతుందని ప్రకటించిన తర్వాత తమ పార్టీకి చెందిన నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారని అన్నారు. తక్కువ సమయంలోనే ప్రజలు తమను ఆదరించారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసి అద్భుత విజయాన్ని సాధించాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము 40 వార్డులు గెలుచుకున్నామని అన్నారు.

అధికారికంగా 33 స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారని, మరో 7చోట్ల సాంకేతిక కారణాల వల్ల స్వతంత్రులుగా గెలిచారని వెల్లడించారు. ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చిందని కవిత వెల్లడించారు.

తమ విజయంలో తెలంగాణ జాగృతి ప్రమేయం లేదని ఏఐఎఫ్‌బీ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాసులు నిన్న ప్రకటించారు. అయితే ఈరోజు కవిత ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అంబటి బోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం. వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి, ఏఐఎఫ్‌పీ కలిసి కైవసం చేసుకున్నాయని కవిత స్పష్టం చేశారు.
Kavitha
Kalvakuntla Kavitha
BRS Party
Telangana Jagruthi
Telangana Politics
Revanth Reddy

More Telugu News