మోదీ గారూ, మీ కోసం అసోం నుంచి మణిపూర్‌కు టిక్కెట్ బుక్ చేశాం: కాంగ్రెస్ సీనియర్ నేత

  • అసోంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • మణిపూర్ లో పర్యటించకపోవడంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్న
  • టిక్కెట్ బుక్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ ఖేరా
ప్రధాని నరేంద్ర మోదీకి అసోం నుంచి మణిపూర్‌కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ బుక్ చేసింది. ఈశాన్య భారతంలో తొలిసారి ఏర్పాటైన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. దీనిపై మోదీ ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలో మణిపూర్ కూడా వెళ్లాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈ టిక్కెట్ బుక్ చేసింది.

మణిపూర్‌లోని లిటాన్ సరిఖోంగ్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి తాంగ్‌ఖుల్ నాగా వర్గానికి చెందిన వారి ఇళ్లకు సాయుధ మిలిటెంట్లు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ అసోం పర్యటనకు వెళుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మణిపూర్ అంశాన్ని లేవనెత్తింది.

ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించకపోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. అసోం నుంచి మణిపూర్‌కు కేవలం గంటలో వెళ్లవచ్చని ప్రధానికి సూచించారు. ఆయన అక్కడకు వెళ్లడానికి తామే టిక్కెట్ బుక్ చేశామని వెల్లడించారు.

మణిపూర్ గత మూడేళ్లుగా మండుతోందని, తాజా దాడులతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయని పవన్ ఖేరా ఆందోళన వ్యక్తం చేశారు. "మీరు ఇప్పుడు అసోంలోనే ఉన్నారు. అక్కడి నుంచి మణిపూర్ వెళ్లడానికి గౌహతి విమానాశ్రయం నుంచి ఇంఫాల్‌కు విమానం టిక్కెట్ బుక్ చేశాం. మీ ఆ విమానంలో మణిపూర్ వెళ్లవచ్చు. మీ ఫోన్ నెంబర్ నా వద్ద లేదు కాబట్టి విమాన టిక్కెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాను. దయచేసి ఈ టిక్కెట్ ద్వారా మణిపూర్ వెళ్లండి" అని మోదీని ఉద్దేశించి 'ఎక్స్'లో పోస్టు పెట్టారు.


More Telugu News