అమరావతిలో బిట్స్ పిలానీ పనులు ప్రారంభం... నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణం
  • పోర్టబుల్ క్యాబిన్లు, భారీ యంత్రాలు వచ్చాయన్న నారా లోకేశ్
  • ఇన్నోవేషన్, ఏఐ రంగాలకు ఇది కేంద్రంగా నిలుస్తుందని వ్యాఖ్య
  • ఎడ్యుకేషన్ క్యాపిటల్‌గా అమరావతి రూపుదిద్దుకుంటోందని హర్షం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్-పిలానీ) క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం ప్రకటించారు. నిర్మాణ పనులు మొదలైనందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్ స్పందిస్తూ.. "అమరావతిలో నిర్మాణ పనులు మొదలయ్యాయి! పోర్టబుల్ క్యాబిన్లు, భారీ యంత్రాలు రంగంలోకి దిగాయి. ప్రపంచ స్థాయి విద్యకు భవిష్యత్ వేదిక రూపుదిద్దుకుంటోంది" అని తెలిపారు. బిట్స్ పిలానీ తమ నూతన క్యాంపస్ నిర్మాణాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు.

"ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), నెక్స్ట్-జెన్ లెర్నింగ్ వంటివి ఇక్కడ అభివృద్ధి చెందుతాయి. రూపుదిద్దుకుంటున్న ఈ ఎడ్యుకేషన్ క్యాపిటల్‌కు స్వాగతం" అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ క్యాంపస్ ఏర్పాటుతో అమరావతిని ఉన్నత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో మరో కీలక అడుగు పడినట్లయింది. ఈ పరిణామంపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.


More Telugu News