థాయ్‌లాండ్‌లో స్కూల్లోకి జొరబడి విద్యార్థులు, టీచర్లపై కాల్పులు

  • సోంఘ్‌క్లా ప్రావిన్స్‌లో ఘటన.. ఒకరి మృతి
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • 18 సంవత్సరాల వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడని వెల్లడి
థాయ్‌లాండ్‌లో ఒక దుండగుడు స్కూల్‌లోకి జొరబడి విద్యార్థులు, ఉపాధ్యాయులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, థాయ్‌లాండ్‌లోని సోంఘ్‌క్లా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పాఠశాలలో దుండగుడు బంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను పోలీసులు రక్షించారు. నిందితుడు 18 సంవత్సరాల కుర్రాడు అని, అతడు పలుమార్లు తన తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. నిందితుడు తుపాకీతో ఫటోంగ్ ప్రథాన్ ఖిరివాట్ పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడని తెలిపారు. కాగా, 2022లో ఒక మాజీ పోలీసు అధికారి తుపాకీ, కత్తితో దాడి చేయడం వల్ల ఒక నర్సరీ స్కూల్లో 22 మంది పిల్లలు సహా 36 మంది చనిపోయారు.


More Telugu News