Siddaramaiah: సిద్ధరామయ్య తన మాటను నిలబెట్టుకుంటారు: నాయకత్వ మార్పుపై డీకే శివకుమార్ సోదరుడు

కర్ణాటక కాంగ్రెస్‌లో సంక్షోభం తీవ్రమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకుంటారని భావిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి మార్పు అంశంపై గత కొంతకాలంగా కర్ణాటకలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే సురేశ్ ఈ అంశంపై స్పందించారు. ఇప్పటికే ఆలస్యమైందని, అయినప్పటికీ సిద్ధరామయ్య మాటను నిలబెట్టుకుంటారని తాము విశ్వసిస్తున్నామని అన్నారు.

మరోవైపు, నాయకత్వ మార్పునకు సంబంధించిన ప్రశ్నలపై, డీకే సురేశ్ ప్రకటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, మీడియా పదేపదే ఒకే ప్రశ్న అడగకూడదని అన్నారు. అధిష్ఠానం నిర్ణయం ఏదైనా తాను, డీకే శివకుమార్ ఇద్దరం కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. నిర్ణయాన్ని అధిష్ఠానానికే వదిలేస్తున్నట్లు చెప్పారు.

మీడియా ఇతర అంశాలను పక్కనపెట్టి పదేపదే నాయకత్వ మార్పు గురించి ప్రశ్నిస్తోందని సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. నాయకత్వ మార్పు గురించి ఎందుకు మాట్లాడుతున్నారని, అలాంటి ప్రకటనలు చేస్తున్న వారిని అడగాలని సూచించారు.

ఎమ్మెల్యేలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు వారి సొంత ఖర్చులతో వెళుతున్నారని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. త్వరలో బడ్జెట్ తేదీని ప్రకటిస్తామని అన్నారు.

ఢిల్లీలో ఉన్న డీకే శివకుమార్ నాయకత్వ మార్పు అంశంపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, తాను ఏం మాట్లాడుకున్నామో తమకు తెలుసని, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందామని పేర్కొన్నారు. సిద్ధరామయ్య తన మాటను నిలబెట్టుకోవాలని మీ సోదరుడు డీకే సురేశ్ అన్నారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, డీకే శివకుమార్ స్పందిస్తూ, కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.
Siddaramaiah
DK Shivakumar
Karnataka Congress
DK Suresh
Chief Minister
Leadership Change

More Telugu News