తెలంగాణలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి: డీకే అరుణ

  • రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన అరుణ
  • మున్సిపల్ ఎన్నికల తర్వాత పన్నులు పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోందని ఆరోపణ
  • మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించానని వెల్లడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆమె మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పన్నులు పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోందని ఆరోపించారు. ఖజానాలో చిల్లిగవ్వ లేదని... మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని విమర్శించారు. 

అన్ని మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించామని అరుణ తెలిపారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించానని చెప్పారు. 

మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్ పూర్ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరమని అరుణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పారదర్శక, అవినీతి రహిత పాలనే బీజేపీ లక్ష్యమని చెప్పారు. ప్రతి వార్డులో డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు తదితర అంశాలపై దృష్టి సారిస్తామని... కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల్లోని స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.


More Telugu News